Pawan Kalyan: వామన రూపంలో మహా విష్ణువు ఎదిగినట్టు పవన్ కల్యాణ్ ఎదుగుతున్నారు: జనసేన నేత కిశోర్

- పవన్ వల్ల డిప్యూటీ సీఎం పదవికి చరిష్మా వచ్చిందన్న కిశోర్
- పవన్ గురించి యావత్ దేశం చర్చిస్తోందని ప్రశంస
- తండాలకు సైతం రోడ్లు వేయిస్తున్నారని కితాబు
పవన్ కల్యాణ్ వల్ల డిప్యూటీ సీఎం పదవికి చరిష్మా వచ్చిందే కానీ... ఆ పదవి వల్ల పవన్ కు ప్రత్యేక చరిష్మా రాలేదని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిశోర్ గునుకుల అన్నారు. గతంలో ఎవరెవరు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారో తనతో పాటు చాలా మందికి తెలియదని... కానీ ఈరోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గురించి యావత్ దేశం చర్చిస్తోందని చెప్పారు. వామన రూపంలో ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా మహా విష్ణువు ఎదిగినట్టు... పవన్ కల్యాణ్ ఎదుగుతున్నారని అన్నారు. కావలిలో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పల్లెలు అభివృద్ధి చెందాలంటే పల్లె నుంచి నగరానికి కనెక్టవిటీ రోడ్లు ఉండాలని ఆరోజు ప్రశ్నించిన గొంతుక (పవన్)... ఈరోజు తండాలకు సైతం రోడ్లు వేయిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని కిశోర్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆరోజు నినదించిన స్వరం... ఈరోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడిందని, ఉక్కు కర్మాగారానికి కోట్ల రూపాయలు విడుదల చేయించి ఆంధ్ర జాతికి గర్వకారణంగా నిలిచిందని చెప్పారు.