Kakani Govardhan Reddy: మళ్లీ వైసీపీ వస్తుంది.. గుడ్డలు ఊడదీసి నిలబెడతాం: కాకాణి గోవర్ధన్

- పోలీసులు టీడీపీ వాళ్లకు సహకరిస్తున్నారంటూ కాకాణి మండిపాటు
- పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తామని వార్నింగ్
- టీడీపీకి సహకరిస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదన్న కాకాణి
పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రేపటి రోజున మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పోలీసులు ఊహించుకోవాలని అన్నారు.
బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాయాలపాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో వైసీపీ వర్గీయులు కత్తులు పట్టుకుని హల్ చల్ చేశారు. దీంతో, ఆసుపత్రి వద్ద మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ వాళ్లను కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు టీడీపీ వాళ్లకు సహకరిస్తున్నారంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.