cm revanth reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన

- సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు
- సోమవారం (20వ తేదీ) నుంచి దావోస్లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి బృందం
- గత దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో తెలంగాణకు సుమారు 40 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం 20వ తేదీ (నుంచి) మూడు రోజుల పాటు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్ధిక ఫోరం సదస్సులో పాల్గొననున్న నేపథ్యంలో ఆదివారంతో సింగపూర్ పర్యటన ముగించింది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరిపింది. ఇండియన్ ఓషియన్ గ్రూప్ సీఈవో ప్రదీప్, డీబీఎస్, బ్లాక్ స్టోన్, మైన్ హార్డ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ భేటీ అయ్యారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం ఈ నెల 20 నుంచి 22 వరకూ దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక ఫోరం సదస్సులో పాల్గొననుంది. గతంలో సుమారు 40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన కారణంగా ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా దృష్టి పెట్టడంతో పాటుగా కొత్తగా తీసుకువచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ సదస్సులో వివరించనుంది.