Goa: గోవాలో విషాదం.. పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడి టూరిస్ట్, ఇన్ స్ట్రక్టర్ దుర్మరణం

- కొండ పైనుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే ప్రమాదం
- తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయిన మహారాష్ట్ర మహిళ, ఇన్ స్ట్రక్టర్
- పారాగ్లైడింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవన్న పోలీసులు
సరదాగా గడిపేందుకు గోవా వెళ్లిన మహారాష్ట్ర మహిళ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళతో పాటు పారాగ్లైడింగ్ ఇన్ స్ట్రక్టర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. నార్త్ గోవాలోని కేరి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన శివానీ దాబ్లే గోవా పర్యటనకు వచ్చింది. శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ కోసం కేరి గ్రామ సమీపంలోని ఓ కొండపైకి వెళ్లింది.
ఆమెతో పాటు పారాగ్లైడింగ్ కంపెనీకి చెందిన ఇన్ స్ట్రక్టర్ సుమల్ నేపాలీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొండ పైనుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే పట్టుతప్పి ఇద్దరూ కింద లోయలో పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన శివాని, సుమల్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, పారాగ్లైడింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వివరించారు. కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.