Chandrababu: రేపు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు... పూర్తి షెడ్యూల్ ఇదిగో!

- దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 'బ్రాండ్ ఏపీ'కి ప్రమోషన్
- ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
- కొత్త పాలసీలు, రాష్ట్ర అనుకూలతలు వివరించి పెట్టుబడిదారులకు ఆహ్వానం
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రేపు (జనవరి 19) బయల్దేరి వెళుతున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో భాగస్వాములు అవ్వడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సీఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతో పాటు గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా ఇప్పటికే ఏపీలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల కు పైగా పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరిగాయి. రానున్న రోజుల్లో అర్సెల్లార్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ, బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను వేదికగా చేసుకోనున్నారు.
రేపు రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు సీఎం బృందం
ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దావోస్ ప్రర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. డిల్లీ నుంచి బయల్దేరి తన బృందంతో జ్యూరిచ్ కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు.
అనంతరం హిల్టన్ హోటల్ లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. తరువాత అక్కడి నుంచి హోటల్ హయట్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా' పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు.
అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. తరువాత అర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్ కు చేరుకుంటారు.
రెండవ రోజు సీఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్ స్పన్, ఎల్ జి, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో రెండో రోజు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు.
అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న 'ఎనర్జీ ట్రాన్సిషన్: వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్' అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు. అనంతరం 'ది నెక్ట్స్ వేవ్ పయనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో' అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. బ్లూమ్ బర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు.
మూడవ రోజు కూడా పలు వ్యాపార దిగ్గజాలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.
షెడ్యూల్ మీటింగ్స్ తో పాటు... నాలుగు రోజుల సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. సీఎం చంద్రబాబుతో పాటు పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్, ఐటీ మంత్రి నారా లోకేశ్ తో పాటు ఇండస్ట్రీ శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు కూడా దావోస్ వెళుతున్నారు.
నాలుగు రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్దరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.