Tirumala Incidents: తిరుమలలో ఇటీవలి ఘటనలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ

- ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట... ఆరుగురి మృతి
- తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
- తిరుమలలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. కొన్ని రోజుల కిందట తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. అటు, తిరుమలలో లడ్డూ కౌంటర్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ఘటనల వెనుక కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ జనవరి 19, 20 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన, లడ్డూ కౌంటర్ అగ్నిప్రమాదం వివరాలు తెలుసుకోనున్నారు. జిందాల్ తన పర్యటనలో టీటీడీ అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం, కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నారు.