DK Aruna: ఈడీ ఏం ప్రశ్నలు అడిగిందో కేటీఆర్ బయటకు చెప్పకూడదు... కానీ!: డీకే అరుణ

- అయినా లోపల అడిగింది... బయట చెబుతోంది ఒకటేనా? తేలాల్సి ఉందని వ్యాఖ్య
- ఫార్ములా ఈ-రేసులో త్వరలో అన్ని అంశాలు బయటకు వస్తాయన్న అరుణ
- కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత వల్ల రేవంత్ సీఎం అయ్యారని వ్యాఖ్య
ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో విచారణలో ఈడీ ఏం ప్రశ్నలు అడిగిందనేది కేటీఆర్ బయటకు చెప్పకూడదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. కానీ ఆ ప్రశ్నలను కేటీఆర్ బయటకు చెప్పడం సరికాదన్నారు. అయినా లోపల అడిగింది... బయట కేటీఆర్ చెబుతోంది ఒకటేనా? అనేది తెలియాల్సి ఉందన్నారు. కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంలో త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వేచి చూడాలన్నారు. ఈరోజు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత వల్ల రేవంత్ సీఎం అయ్యారు
కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం వల్ల... అనుకోకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ప్రజలు కాంగ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో చెప్పిన అబద్ధాలనే రేవంత్ రెడ్డి ఢిల్లీలోనూ చెప్పారని విమర్శించారు. తెలంగాణలో తమ పాలనను చూసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కానీ ఏడాదిలో చేసిందేమీ లేదన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఇంకా ఎంతకాలం ఉట్టి విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి మాటలను విశ్వసించడం లేదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఢిల్లీలో అధికారం తమ పార్టీదే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారం గాడి తప్పిందన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందన్నారు.