KTR: కాంగ్రెస్ దాడులు చేస్తోంది... అల్లరి మూకపై చర్యలు తీసుకోండి: డీజీపీకి కేటీఆర్ విజ్ఞప్తి

- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి... ఖండించిన కేటీఆర్
- దాడులకు ముగింపు పలకకుంటే కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరిక
- పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శ
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడి దుర్మార్గమన్నారు. ఇలాంటి దాడులకు ముగింపు పలకకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇలాంటి దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేస్తూ అరాచకం సృష్టించే కుట్రను సీఎం రేవంత్ రెడ్డి ముఠా చేస్తోందన్నారు. ఇలాంటి అరాచకాలు, బెదిరింపులకు పాల్పడినా... కాంగ్రెస్ మోసాలను, అవినీతిని ఎండగడుతూనే ఉంటామన్నారు.
ఇప్పటికైనా దాడులకు ముగింపు పలకకుంటే కాంగ్రెస్ గుండాలకు గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు ఇన్ని దాడులకు తెగబడుతూ... శాంతిభద్రతల సమస్యగా మారినా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు.