Devendra Fadnavis: సైఫ్ అలీఖాన్పై దాడి ఘటన పట్ల స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్

- సైఫ్ అలీఖాన్ మీద దాడి ఘటనను పోలీసులు విచారిస్తున్నారన్న ఫడ్నవీస్
- ఇటీవలి కాలంలో కొన్ని దుర్ఘటనలు జరిగిన మాట వాస్తవమేనన్న మహా సీఎం
- ముంబై సురక్షితం కాదని చెప్పడం ప్రతిపక్షాలకు సరికాదని వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ దాడి ఘటనపై పోలీసులు విచారిస్తున్నారని, వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారని తెలిపారు. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
దేశంలోని మెగా సిటీల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరమన్నారు. ముంబైలో ఇటీవలి కాలంలో కొన్ని దుర్ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని... వాటిని తాము కూడా అంతే తీవ్ర ఘటనలుగా భావించి విచారిస్తున్నామన్నారు.
అయితే ఇలాంటి ఘటనల ఆధారంగా ముంబై సురక్షితం కాదని ప్రతిపక్షాలు అనడం సరికాదన్నారు. ముంబై ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు. ఈ నగరాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.