Hindenburg: హిండెన్బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ సంచలన ప్రకటన.. సంస్థ మూసివేత!

- సంస్థను మూసివేస్తామని ప్రకటించిన ఫౌండర్ నాథన్ అండర్సన్
- ఈ నిర్ణయం వెనక భయాలు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య కారణాలు ఏమీ లేవని స్పష్టీకరణ
- హిండెన్బర్గ్ ను 2017లో ప్రారంభించిన అండర్సన్
- అదానీ గ్రూప్ సహా పలు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని నివేదికలు విడుదల చేసిన సంస్థ
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన చేశారు. తన సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. "నేను హిండెన్బర్గ్ రీసెర్చ్ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాను. మేము పని చేస్తున్న కొన్ని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సంస్థ మూసివేయబడుతుంది" అని హిండెన్బర్గ్ వెబ్సైట్లోని ఒక నోట్లో నాథన్ అండర్సన్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వెనక ఎలాంటి భయాలు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా, హిండెన్బర్గ్ ను నాథన్ అండర్సన్ 2017లో ప్రారంభించారు.
ఇక ఆమధ్య హిండెన్బర్గ్ నివేదికలతో భారత్లోని అదానీ గ్రూప్ తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. 2022, 2024లో అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని హిండెన్బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికలు సంచలనం సృష్టించాయి. ఈ షార్ట్ సెల్లర్ గతంలో ఇండియన్ మార్కెట్స్ రెగ్యులేటర్ చీఫ్ మాధవి పూరి బుచ్, ఆమె భర్తను కూడా లక్ష్యంగా చేసుకుని కీలక నివేదికలు బయటపెట్టిన విషయం తెలిసిందే.