BR Naidu: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

- తొక్కిసలాట ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్న బీఆర్ నాయుడు
- ఇప్పటి వరకు 31 మందికి చెక్కులు ఇచ్చామని వెల్లడి
- తప్పుడు కథనాలను ఎవరూ నమ్మవద్దని విన్నపం
వైకుంఠ దర్శనాల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని... వాటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. కొందరు పనికట్టుకుని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలని విన్నవించారు.
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఆ ఘటన చాలా దురదృష్టకరమని... భవిష్యత్తులో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారని... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
టీటీడీ బోర్డు సభ్యులు మూడు బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి చెక్కులు అందించారని బీఆర్ నాయుడు తెలిపారు. 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని... మరో 20 మందికి చెక్కులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారని వెల్లడించారు.