rythu bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ .. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల

- జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు
- పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు
- డీబీటీ పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపింది.