Rythu Bharosa: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు... ఇవే

Cabinet sub committee meeting on Rythu Bharosa
  • సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం
  • ఐటీ చెల్లింపు, భూమి పరిమితిని పెట్టవద్దని అభిప్రాయపడిన కమిటీ
  • రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం
రైతు భరోసా కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.

రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితిని పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. అలాగే, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉప సంఘం ఏర్పాటైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయింది.

కాగా, అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను ఇవ్వనుంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Rythu Bharosa
Telangana
Congress

More Telugu News