Promotions: ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు

AP Govt promotes senior IAS and IAS officials

  • పలువురు ఐఏఎస్ లకు ముఖ్య కార్యదర్శి హోదా
  • మరికొందరికి కార్యదర్శి హోదా
  • ఐపీఎస్ అధికారులు సిద్ధార్థ్ కౌశల్, విక్రాంత్ పాటిల్ లకు కూడా పదోన్నతి

నూతన సంవత్సర ఆగమనానికి ముందు ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వ శుభవార్త చెప్పింది. వారికి ప్రమోషన్లు ఇస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 

సీనియర్ ఐఏఎస్ అధికారులు సాల్మన్ ఆరోక్యరాజ్, సురేశ్ కుమార్ లకు పదోన్నతి కింద ముఖ్య కార్యదర్శి హోదా కల్పించారు. ఇకపై సురేశ్ కుమార్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. డిప్యుటేషన్ పై కేంద్రం ప్రభుత్వంలో పనిచేస్తున్న సాల్మన్ ఆరోక్యరాజ్ కూడా పదోన్నతి అనంతరం ముఖ్య కార్యదర్శి హోదా పొందుతారు. వీరిద్దరూ 2000 సంవత్సరం బ్యాచ్ కి చెందిన అధికారులు. 

ఇక, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్, కార్తికేయ మిశ్రాలకు కార్యదర్శి హోదా కల్పించారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఇకపై ఆయన సీఎంవోలోనే కార్యదర్శిగా కొనసాగుతారు. కడప జిల్లా కలెక్టర్ గా ఉన్న శ్రీధర్ అదే పదవిలో కొనసాగనుండగా... గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా ఉన్న వీరపాండ్యన్ కూడా అదే పదవిలో కొనసాగనున్నారు. 

అటు, ఐపీఎస్ అధికారులు సిద్ధార్థ్ కౌశల్, విక్రాంత్ పాటిల్ కూడా ప్రమోషన్లు అందుకున్నారు. అయితే వీరిద్దరి పదవులపై స్పష్టత రావాల్సి ఉంది. విక్రాంత్ పాటిల్ ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తుండగా... సిద్ధార్థ్ కౌశల్ లా అండ్ ఆర్డర్ ఐజీగా కొనసాగుతున్నారు.

Promotions
IAS
IPS
AP Govt
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News