Chandrababu: ఏపీలో మరో భారీ ప్రాజెక్టు... చంద్రబాబు సమీక్ష

CM Chandrababu reviews on irrigation dept

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్ష 
  • ప్రతి ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక
  • సముద్రంలో వృధాగా కలిసే నీటిని మళ్లించే బృహత్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు
  • కేంద్రం సాయం తీసుకోవాలని నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో నీటిపారుదల శాఖ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి... రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందని, పోలవరంతో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు తెలిపారు. 

గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని,  ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా... కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూర్చేందుకు కార్యచరణ తీసుకువస్తున్నట్టు వివరించారు. 

రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్లకు తరలించడమే మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు

ప్రాజెక్టు వివరాలు

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. 

దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్దం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. 200 టిఎంసిల సమర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటికి తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు. 

బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, SRBC, నిప్పుల వాగుకు నీళ్ళు వెళుతుంటాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు.

కేంద్ర ఆర్థిక సాయానికి ప్రయత్నాలు

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.70 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 54 వేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. 

ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయంపై విన్నవించారు.

Chandrababu
Irrigation
Review
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News