HYDRA: హైడ్రా కూల్చివేతలు ఆగవు... కానీ ఆ తర్వాతే: కమిషనర్ రంగనాథ్

Hydra commissioner Ranganath about demolitions

  • రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో హైడ్రాకు ఓ ప్లాన్ ఉందన్న రంగనాథ్
  • మూసీ రివర్ ఫ్రంట్‌కు తమకు సంబంధం లేదని వెల్లడి
  • ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామన్న హైడ్రా కమిషనర్

హైడ్రా కూల్చివేతలు ఆగవని... చెరువుల ఎఫ్‌టీఎల్‌‌ను నిర్ధారించిన తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలు పెడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో కూడా హైడ్రాకు ఒక ప్లాన్ ఉందని తెలిపారు.

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతుందన్నారు. రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేస్తుందని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా మూసీ ఆక్రమణలపై కూడా దృష్టి సారిస్తామన్నారు.

ఆక్రమణల విషయంలో భూ యజమానులకు మాత్రమే కాదని... కిరాయిదారులకు కూడా నోటీసులు ఇస్తామన్నారు. ప్రస్తుతం చెరువుల పునరుజ్జీవంపై దృష్టి సారించామన్నారు. త్వరలో 12 చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

జులై 19కి ముందు అనుమతులు పొంది ఉండి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసాలను కూల్చబోమని హామీ ఇచ్చారు. కమర్షియల్ బిల్డింగ్‌లపై మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయానికి వచ్చి ఎవరైనా ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. హైడ్రా ఎవరికీ ఎన్‌వోసీ ఇవ్వదని తెలిపారు.

మధురా నగర్‌లో తాము ఉంటున్న ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రంగనాథ్ అన్నారు. ఇప్పుడు అక్కడ చెరువు లేదని.. అయినప్పటికీ తాము చెరువు కట్టకు కిలోమీటర్‌ దూరంలో ఉన్నామని వెల్లడించారు. నెగిటివ్ ప్రచారం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.

HYDRA
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News