visakha dairy: బీజేపీ గూటికి చేరిన విశాఖ డెయిరీ చైర్మన్

visakha dairy chairman anand kumar joined in bjp

  • ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్ కుమార్
  • పది మంది విశాఖ డెయిరీ డైరెక్టర్లు, మద్దతుదారులతో పార్టీలో చేరిక
  • ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆడారి అనంద్ కుమార్

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్, ప్రముఖ వాణిజ్య వేత్త ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీ గూటికి చేరారు. పది మంది డైరెక్టర్లు, తమ మద్దతుదారులతో ఆడారి ఆనంద్ బుధవారం రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పురందేశ్వరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడి పని చేయాలని ఈ సందర్భంగా పురందేశ్వరి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
 
విశాఖ డెయిరీలో అక్రమాలపై జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన శాసనసభ సభా సంఘం విచారణ జరుగుతున్న తరుణంలో ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోని బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. 

2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆడారి ఆనంద్ .. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరారు. 2023లో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఎండీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి పీజీవీఆర్ నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు.    
 
 

visakha dairy
adari anand kumar
bjp
Daggubati Purandeswari
  • Loading...

More Telugu News