KTR: భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి: కేటీఆర్‌

KTR Pays Floral Tribute to PV Narasimha Rao

  • నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి
  • ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘన నివాళి
  • పీవీ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమ‌న్న కేటీఆర్‌
  • తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని ప్ర‌శంస‌
  • పీవీ శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింద‌న్న కేటీఆర్

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని అన్నారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని కొనియాడారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. 

వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందన్నారు. అంతేగాక‌ పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. పీవీ కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి.. జోహార్ పీవీ! అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

KTR
PV Narasimha Rao
Telangana

More Telugu News