Anagani satya prasad: అక్రమాలకు తావు లేకుండా భూ సర్వే: ఏపీ మంత్రి అనగాని

will simplify land records and solve disputes

  • విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ స్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
  • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనల ప్రకారం భూముల రీ సర్వే జరగలేదన్న మంత్రి  
  • వివాదాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్న మంత్రి 

రాష్ట్రంలో అక్రమాలకు తావులేకుండా భూ సర్వే నిర్వహిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన ప్రాంతీయ స్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. శాఖాపరంగా అమలవుతున్న 12 అంశాలపై సమీక్ష చేశారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీ సర్వే చేపట్టినప్పటికీ అది నిబంధనల ప్రకారం జరగలేని మంత్రి అనగాని విమర్శించారు. నాటి ప్రజా ప్రతినిధులు, నాయకులు సర్వేను తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు 98 వేలకు పైగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని చెప్పారు. 

ఇప్పటి వరకు 6,680 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని, ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అనేక అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిపై పారదర్శకంగా విచారణ జరిపి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో జరిగిన భూ ఆక్రమణలు, రికార్డుల మార్పిడి వంటి అక్రమాల్లో కొందరు అధికారుల పాత్రపై ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఒకసారి 22ఏ నుంచి తొలగించే భూములకు పూర్తి వెసులుబాటు కల్పించేలా డిజిటల్ పత్రాలు అందిస్తామన్నారు. మీ భూమి – మీ హక్కు పేరుతో రెవెన్యూ రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి వివాదాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి పాల్గొన్నారు. 

Anagani satya prasad
visakha
land records
  • Loading...

More Telugu News