Kunamneni Sambasiva Rao: తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసేవారిని చరిత్ర క్షమించదు: కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao speech on Telangana Thalli

  • బీఆర్ఎస్ నేతలు కోరుకున్న విధంగా విగ్రహం ఉండదన్న కూనంనేని
  • తెలంగాణ తల్లి విగ్రహం కన్నతల్లిలా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని వ్యాఖ్య
  • రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలన్న కూనంనేని

ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. విగ్రహం ప్రత్యేకతల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వివరించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... సభలో బీఆర్ఎస్ సభ్యులు ఉంటే బాగుండేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలలు కోరుకున్నట్టుగా తెలంగాణ తల్లి ఉండదని చెప్పారు. 

మేధావులు, కవులు, కళాకారుల సలహాలు, సూచనల మేరకు విగ్రహాన్ని రూపొందించారని... ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండేదని కూనంనేని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని చెప్పారు. 

మీరు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవచ్చు కానీ... తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రూపకల్పన చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం కన్నతల్లిలా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని సూచించారు. కాసేపట్లో తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.

Kunamneni Sambasiva Rao
CPI
Telangana Thalli
  • Loading...

More Telugu News