Nadendla Manohar: తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar visits Guntur and Bapatla districts

  • నేడు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన
  • కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని స్పష్టీకరణ
  • రవాణా,  గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్టు వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరు నియోజకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, జంపని గ్రామాల్లో రోడ్డు వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని... రవాణా నిమిత్తం లారీలు,  గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం తెనాలి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం లో మాట్లాడారు. 

"ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమాచారం మేరకు రైతుకు భరోసా నింపేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇదే మిల్లుకి అమ్మాలని రైతులకు నిబంధన ఉండేది... ఆ నిబంధన తొలగిస్తూ రైతులకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే సౌకర్యం కల్పించాం. 

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేశాం. గత సంవత్సరం గత ప్రభుత్వం చేసిన కొనుగోలుతో పోల్చుకుంటే 100 శాతం కొనుగోలు పెరిగింది. రైతు నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే 24 గంటల నుంచి 30 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమవుతుంది. కల్లాల వద్ద రైతు నుంచి ధాన్యం కొనుగోలు కోసం లారీలు,గోతాలు, హమాలీలు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించాం. 

గతంలో జీపీఎస్ విధానం ఉండేది. ఎక్కడైతే జీపీఎస్ విధానం ఉందో ఆ నిబంధనను కూడా తొలగించమని చెప్పాం. ఐదు జిల్లాల్లో వాతావరణ ఇబ్బందులు కారణంగా జీపీఎస్ తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు జరగాలని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాం. 

అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతు ఖాతాలో నగదు జమ కావడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ధాన్యం కొనుగోలుపై రైతులకు మేలు జరిగేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులు తమ మొబైల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం జరపవచ్చు. ఎప్పుడు  అమ్ముకోవాలో కూడా తానే నిర్ణయించుకోవచ్చు... నమ్మకంతో ప్రభుత్వానికి ధాన్యం అమ్మి రైతులు మద్దతు ధర పొందాలి" అని సూచించారు.

Nadendla Manohar
Farmers
Paddy
Guntur District
Bapatla District
Janasena
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News