Sports News: గుజరాత్ క్రికెటర్ సరికొత్త రికార్డ్... 28 బంతుల్లోనే సెంచరీ

Gujarat Urvil Patel smashes second fastest T20 century
  • రిషబ్ పంత్ పేరిట ఉన్న రికార్డ్‌ను తుడిపేసిన ఉర్విల్ పటేల్
  • 7 ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 పరుగులు చేసిన పటేల్
  • ప్రపంచ క్రికెట్‌లో రెండో అత్యుత్తమం
గుజరాత్ క్రికెటర్ ఉర్విల్ పటేల్ టీ20లో 28 బంతుల్లో సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ రిషబ్ పంత్ పేరిట ఉంది. మధ్యప్రదేశ్ వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపుర జట్టుతో 26 ఏళ్ల ఉర్విల్ అసాధారణ ప్రతిభను కనబరిచి పంత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు అతను దూకుడు ప్రదర్శించాడు. 7 ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. గత ఏడాది చండీగఢ్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన విజయ్ హజరే ట్రోఫీలో ఉర్విల్ పటేల్ 41 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఉర్విల్ పటేల్ అన్-సోల్డ్ క్రికెటర్‌గా ఉన్నాడు.

ప్రపంచ క్రికెటర్లలో టీ20లో ఇది రెండో అత్యుత్తమం. ఈ ఏడాదిలోనే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్టోనియాకు చెందిన క్రికెటర్ సాహల్ చౌహాన్ 27 బంతుల్లో సెంచరీ చేశాడు. పొట్టి ఆటలో ఇప్పటి వరకు ఇదే రికార్డ్. 2018 జనవరిలో ఢిల్లీ తరఫున ఆడిన రిషబ్ పంత్ 32 బంతుల్లో మూడంకెల పరుగును చేరుకున్నాడు.
Sports News
Gujarat
T20
Cricket

More Telugu News