NTR: తెలుగు సినీ ప్రేక్షకులకు ఈరోజు చిరస్మరణీయ దినం: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari remembers his late father NTR

  • నేటితో ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 ఏళ్లు
  • 1948 నవంబరు 24న ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశం విడుదల
  • ఆ చిత్రంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించిన ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి

విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు, తెలుగు ఖ్యాతిని నలు దిశలకు చాటిన మహానటుడు నందమూరి తారక రామారావు నట ప్రస్థానానికి నేటితో 75 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు నేడు చిరస్మరణీయ దినం అని పేర్కొన్నారు. 

75 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు... 1949 నవంబరు 24న నాన్న గారు మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించిన 'మనదేశం' సినిమా విడుదలైందని నారా భువనేశ్వరి వెల్లడించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమునికి ఇది సినీ వజ్రోత్సవం అని అభివర్ణించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారని తెలిపారు. ఇది ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి నాంది మాత్రమే కాదని, మరో మాటలో చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ శకం మొదలైందని భువనేశ్వరి వివరించారు. 

"ఎన్టీఆర్ సినీ ప్రయాణం, ఆయన నటనా విశ్వరూపం తలచుకుంటుంటే ఒక కూతురిగానే కాకుండా, ఒక తెలుగు వ్యక్తిగా నేను ఎంతో గర్విస్తాను. ముఖ్యంగా, నాన్న గారు పోషించిన పౌరాణిక చిత్రాల పాత్రలను తలచుకుంటే... తమ రూపాలను ప్రజలకు చూపించమని ఆ దేవుళ్లే ఆయనను ఆశీర్వదించి భూమ్మీదకు పంపారేమో అనిపించి ఒళ్లు పులకరిస్తోంది. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను కారణజన్ముడు అన్నది కూడా అందుకేనేమో!" అని వివరించారు. 

అంతేకాదు, మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోను కూడా నారా భువనేశ్వరి పంచుకున్నారు.

NTR
Nara Bhuvaneswari
Manadesam
Telugu Cine Industry
  • Loading...

More Telugu News