Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా తీర్మానం ప్రవేశపెట్టండి: రేవంత్ రెడ్డి

Revanth Reddy participates in Praja Vijayotsavalu

  • తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి
  • అసెంబ్లీలో ఏకగ్రీవంగా దీనిని ఆమోదింప చేస్తామని వెల్లడి
  • హాస్టళ్లలో నాసిరకం ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని హెచ్చరిక

గతంలో ఓటు హక్కు 21 ఏళ్లకు ఇచ్చేవారని, రాజీవ్ గాంధీ దానిని 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రేపు జరగబోయే శాసన సభ సమావేశాల్లో 21 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. దీనిని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేద్దామన్నారు. 21 సంవత్సరాలు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతూ... జిల్లాలను నడుపుతున్నారని పేర్కొన్నారు. అదే యువకులు ఎమ్మెల్యేలుగా రాణిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు.

హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. నాసిరకం భోజనం పెట్టినా... నాసిరకం ఫుడ్ సరఫరా చేసినా... కనీసం అలా చేయాలనే ఆలోచన వచ్చినా సహించేది లేదన్నారు. అలాంటి వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు. నాసిరకం భోజనం వల్ల హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా సాధికారత, రైతుల సంక్షేమాన్ని సభల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సీఎం సూచించారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7న ట్యాంక్‌బండ్, 8న సచివాలయం, 9న నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Revanth Reddy
Telangana
Sridhar Babu
Congress
  • Loading...

More Telugu News