Madhya Pradesh: ఆసుపత్రి బెడ్పై వ్యక్తి మృతి.. గర్భిణి అయిన అతడి భార్యతో బెడ్ కడిగించిన వైద్యులు.. తర్వాత జరిగింది ఇదీ.. వీడియో ఇదిగో!
![Pregnant woman made to clean hospital bed on which husband died](https://imgd.ap7am.com/thumbnail/cr-20241103tn67270f8f5779f.jpg)
- మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లాలో ఘటన
- దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ
- డాక్టర్, ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు
- మిగతా సిబ్బందికి నోటీసులు
- ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణిస్తే.. బెడ్పై ఉన్న రక్తపు మరకలను ఐదు నెలల గర్భిణి అయిన అతడి భార్యతో కడిగించారు. మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లా గర్డాసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్టోబర్ 31న జరిగిందీ అమానుష ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గిరిజన గ్రామమైన లాల్పూర్లో గురువారం ఓ భూవివాదానికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు శివరాజ్ మరావి (40) అనే వ్యక్తి మరణించాడు. దీంతో బెడ్పై ఉన్న రక్తపు మరకలను ఆసుపత్రి సిబ్బంది.. గర్భిణి అయిన ఆయన భార్యతో కడిగించారు.
అసలే భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆమెతో బెడ్ను కడిగించడం వివాదాస్పదమైంది. ఆమె బెడ్ను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. వైద్యుడు, ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందికి నోటీసులు జారీచేశారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్ను కరంజియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ట్రాన్స్ఫర్ చేశారు.