AP High Court: దివ్యాంగురాలిగా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయురాలి తొలగింపును సమర్థించిన ఏపీ హైకోర్టు

AP High Court Uphold DEO Orders To Dismiss Teacher

  • 70 శాతం వినికిడి లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం
  • ప్రకాశం జిల్లా పి.నాగులవరం జడ్పీహెచ్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా చేరిక
  • ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలడంతో 2015లో ఉద్యోగం నుంచి తొలగించిన డీఈవో
  • సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీఏటీ
  • డీఈవో ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు.. ఖర్చుల కింద రూ. లక్ష చెల్లించాలని ఆదేశం

వినికిడి లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రంతో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన మహిళ తొలగింపును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. జి.వెంకట నాగమారుతి అనే మహిళ 2012లో దివ్యాంగురాలి కోటా కింద స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లం) పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తనకు 70 శాతం వినికిడి సమస్య ఉన్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పి.నాగులవరం జిల్లా పరిషత్ హైస్కూలులో ఉద్యోగంలో చేరారు. అయితే, ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలడంతో 2015 మార్చి 16న ఆమెను సర్వీసు నుంచి తొలగించారు.

దీంతో నాగమారుతి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీఏటీ.. సర్వీసును డిశ్చార్జ్ చేసే స్వేచ్ఛను ఇస్తూ 2017 అక్టోబర్ 27న ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పును నాగమారుతి హైకోర్టులో సవాలు చేయగా, తాజాగా విచారణ జరిపిన జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఎన్.విజయ్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. 

దివ్యాంగుల కోటా కిందకు రానని తెలిసి కూడా నకిలీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్ జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. డీఈవో ఉత్తర్వులను సమర్థించడంతోపాటు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తున్న విశాఖపట్టణంలోని ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి ఆ సొమ్మును నెల రోజుల్లో అందించాలని ఆదేశించింది. 

AP High Court
School Assistant
Prakasham District
  • Loading...

More Telugu News