Canada: కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.. విద్యార్థులకు సంకీ వర్మ హెచ్చరిక

Sanjay Verma Warns Indian Students Who Want To Go Canada

  • కెనడాలో పరిస్థితులు ఏమంత బాగోలేవన్న రీకాల్ అయిన రాయబారి సంజయ్ వర్మ
  • ఉద్యోగం రాక ఒత్తిడిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన
  • తన హయాంలో వారానికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను భారత్ పంపినట్టు గుర్తుచేసుకున్న వర్మ

భవిష్యత్తుపై ఆశలతో కెనడా విమానమెక్కే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కెనడాలో ఇటీవలి వరకు భారత రాయబారిగా పనిచేసిన సంజయ్ వర్మ హెచ్చరించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నాణ్యత లేని కాలేజీల్లో చదువుతూ, ఉద్యోగం రాక ఒత్తిడిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

తన హయాంలో ఒకానొక సమయంలో వారానికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బ్యాగుల్లో పెట్టి భారత్‌కు పంపినట్టు గుర్తుచేసుకున్నారు. ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ బాధలను (వైఫల్యాన్ని) తల్లిదండ్రులకు చెప్పకుండా ఆత్మహత్యలను ఎంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ వర్మ 2022 నుంచి ఇటీవలి వరకు కెనడాలో భారత రాయబారిగా పనిచేశారు. ఖలిస్థానీ వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో ఈ నెల మొదట్లో ఆయన భారత్ చేరుకున్నారు. 

బంధం బాగున్నా పంపొద్దు
ఆ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. భారత్-కెనడా మధ్య సంబంధాలు బాగున్నా సరే.. తమ పిల్లలను కెనడా పంపేందుకు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కోరారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కెనడా వెళ్లే వారు బాడీ బ్యాగుల్లో తిరిగి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు ఏమంత బాగోవని, వారానికొక రోజు మాత్రమే క్లాసులు జరుగుతాయని, ఇరుకైన వసతి గృహాల్లో విద్యార్థులు ఉండాలని, ఒక్కోసారి ఒకే రూములో 8 మంది వరకు ఉండాల్సి వస్తుందని చెప్పారు.  

ఇంజినీర్ కావాల్సినోడు క్యాబ్ డ్రైవర్‌గా
కెనడా వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తిచేసి పెద్ద ఇంజినీర్లు అయిపోతారని అనుకుంటామని, కానీ అక్కడ వారు క్యాబ్ డ్రైవర్‌గా, ఓ దుకాణంలో చాయ్, సమోసా అమ్ముకుంటూ కనిపిస్తారని చెప్పారు. అక్కడ క్షేత్రస్థాయిలో జరిగేది ఇదేనని వర్మ వివరించారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను కెనడా పంపేందుకు ఒకటి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. 

విదేశాల్లో 13.35 లక్షల మంది విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన గణాంకాల ప్రకారం 13,35,878 భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వీరిలో కెనడాలో 4.27 లక్షలమంది చదువుతుండగా, అమెరికాలో 3,37,630 మంది, చైనాలో 8,580 మంది, గ్రీస్‌లో 8 మంది, ఇజ్రాయెల్‌లో 900 మంది, పాకిస్థాన్‌లో 14 మంది, ఉక్రెయిన్‌లో 2,510 మంది చదువుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News