GHMC: మయోనైజ్ వినియోగంపై ప్రభుత్వానికి లేఖ రాసిన జీహెచ్ఎంసీ

ghmc written letter to government on ban mayonnaise

  • హోటల్స్‌లో మయోనైజ్‌ వాడకాన్ని నిషేధించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదన
  • హోటల్స్‌లో నాసిరకం మయోనైజ్ తినడంతో అస్వస్థతకు గురవుతున్న యువత 
  • వరుస ఘటనలతో కీలక నిర్ణయం తీసుకున్న బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం

హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో నాసిరకం మయోనైజ్ ‌తినడం వల్ల కొందరు యువతీ యువకులు ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హానికర బాక్టీరియా విపరీతంగా వృద్ధి చేసే మయోనైజ్‌ను నిషేధించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లేఖ రాసింది. 
 
బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్ధాల్లో మయోనైజ్‌ను చెట్నీగా వేసుకుని ఆహార ప్రియులు ఇష్టంగా తీసుకుంటుంటారు. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో మయోనైజ్‌ను తయారు చేస్తారు. అయితే దీని తయారీలో పలు హోటళ్లలో శుభ్రత పాటించడం లేదన్న అభియోగాలు వస్తున్నాయి. ఇటీవల అల్వాల్‌లోని ఓ హోటల్‌లో నాసిరకం మయోనైజ్‌ను తిని పలువురు ఆసుపత్రిపాలయ్యారు. వాంతులు, విరేచనాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 

అలాగే ఈ ఏడాది జనవరిలో కూడా అదే హోటల్‌లో షవర్మ తిన్న 20 మందికిపైగా యువకులు ఆసుపత్రిపాలై మూడు నాలుగు రోజుల పాటు చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కొంత మందికి రక్త పరీక్షలు చేయగా, వారిలో హానికరమైన సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. మయోనైజ్ లో హానికర బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది కాబట్టి ఆ పదార్ధాన్ని నిషేధించి, శాకాహార పదార్ధాలతో చేసే మయోను ప్రోత్సహించాలని బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లేఖ రాసింది. ఆ పదార్ధాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది. 

  • Loading...

More Telugu News