Kinjarapu Ram Mohan Naidu: ఒక్కరోజే 70 విమానాలకు బెదిరింపు కాల్స్... స్పందించిన రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu on threat calls to Aeroplanes

  • 11 రోజుల వ్యవధిలో 250కి పైగా విమానాలకు బెదిరింపు కాల్స్
  • బెదిరింపు కాల్స్ అన్నీ వట్టివేనని తేలిందన్న కేంద్రమంత్రి
  • బెదిరింపులకు పాల్పడితే కఠిన శిక్ష విధించేలా మార్పులు తెస్తున్నామని వెల్లడి

విమానాల బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈరోజు దేశంలోని 70 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... విమానయాన భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు. గత పది రోజులుగా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని, కానీ అవన్నీ వట్టివేనని తేలిందన్నారు.

బెదిరింపు కాల్స్ చేసేవారికి, బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడేవారికి వేసే శిక్షలపై చట్టంలో సెక్షన్లు ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా ఇవి వర్తించేలా మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

గతవారం పలు విమానాలకు బెదిరింపులు రావడంతో వేరే మార్గాలకు మళ్లించినట్లు చెప్పారు. ప్రతి దానిని ప్రత్యేకంగా విశ్లేషించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పుడు బెదిరింపులు అయినప్పటికీ ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి బెదిరింపు కాల్స్‌పై దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 70కి పైగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దేశీయ విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ సంస్థలకు చెందిన పదుల సంఖ్యలో విమానాలకు నకిలీ బెదిరింపులు వచ్చాయి. 11 రోజుల వ్యవధిలో 250కి పైగా విమానాలకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి.

Kinjarapu Ram Mohan Naidu
Aeroplane
BJP
Telugudesam
  • Loading...

More Telugu News