Group 1: నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు... నిబంధనలు గుర్తుంచుకోండి!

Group 1 Mains Exams From Today in Telangana

  • 46 పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు
  • పరీక్ష రాయనున్న 31,383 మంది అభ్యర్థులు
  • డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతి

ఈరోజు ప్రారంభమయ్యే గ్రూప్-1 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలనే ఆందోళన నేపథ్యంలో... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకూడదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు పోలీసులు ఉంటారు. అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

నిబంధనలు ఇవీ...

- అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
- ఇన్విజిలేటర్లు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
- అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి.
- బొమ్మలు పెన్సిల్ లేదా పెన్నుతో వేయాలి. జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు.
- పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టికెట్‌ను ఉపయోగించాలి. హాల్ టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం చేయాలి.
- జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి. - వేర్వేరు భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా గుర్తిస్తుంది.
- పరీక్ష రాయడానికి సహాయకులు అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టిక్కెట్లపై 'స్క్రైబ్' విషయాన్ని పేర్కొంటారు. దివ్యాంగుల కోసం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు సదరు ధ్రువపత్రం తీసుకు రావాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News