Sikkim: వైద్యుల నిర్లక్ష్య ఫలితం.. 12 ఏళ్లుగా మహిళ కడుపులో రెండు కత్తెరలు!

two scissors in womans abdomen for 12 years

  • సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘటన
  • 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్న మహిళ
  • ఆపరేషన్ అనంతరం రెండు కత్తెరలు పొట్టలో ఉంచి కుట్లు వేసిన వైద్యుడు
  • అప్పటి నుంచి పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్న బాధితురాలు
  • తాజాగా శస్త్రచికిత్స చేసి తొలగింపు


వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె పొత్తికడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం పుష్కర కాలం తర్వాత బయటపడింది. 

సిక్కింకు చెందిన బాధిత మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ తర్వాతి నుంచి ఆమె తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పికి కారణం కూడా వారు గుర్తించలేకపోయారు. ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె పొత్తికడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి  వాటిని తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. 

  • Loading...

More Telugu News