KTR: పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌పాగ‌ల్ ప‌నులు: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes Congress Government

  • రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందంటూ ఎద్దేవా
  • ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న ఉంద‌ని మండిపాటు
  • కేసీఆర్ హ‌యాంలో రాష్ట్రం అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందింద‌న్న కేటీఆర్‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు... పాగ‌ల్ ప‌నులు... వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. 

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్... త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తోందని విమ‌ర్శించారు. 
 
మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంద‌ని అన్నారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

* మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే  తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయింది
* మూసీ ప్రాజెక్టులో రూ. 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించింది.

* బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది.

* మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ని రద్దు చేసినా తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ను పదకొండేళ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది. 

* ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్త‌న భాండాగార‌మైంది. దేశంలోనే ధాన్య‌రాశిగా మారింది.

* పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే పారిస్, బొగాట‌, మెక్సికో సిటీ, మాంట్రియ‌ల్‌ల‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుంది.

మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు?  మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు? అంటూ కేటీఆర్ నిల‌దీశారు. 

ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని చుర‌క‌లంటించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కు అని రేవంత్ రెడ్డిని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారు. ప్ర‌పంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నార‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News