6G Technology: భారత్‌లో ఊహించిన దాని కంటే ముందే అందుబాటులోకి రాబోతున్న 6జీ టెక్నాలజీ

Following the swift expansion of 5G India is gearing up for launch of 6G technology

  • 6జీ టెక్నాలజీని తీసుకొచ్చిన తొలి దేశంగా భారత్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా
  • ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 6జీ ప్రణాళికల వెల్లడి
  • 6జీ వినియోగంలోనూ భారత్ అగ్రగామిగా ఉంటుందని విశ్వాసం

దేశంలో 5జీ టెలికం నెట్‌వర్క్ ఎంత శరవేగంగా విస్తరిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే 5జీ విస్తరణ సంపూర్ణంగా పూర్తవ్వక ముందే మన దేశం 6జీ టెక్నాలజీని అందిపుచ్చుకోబోతోంది. ఊహించిన దాని కంటే ముందుగానే భారతీయ యూజర్లు 6జీ టెక్నాలజీని వినియోగించబోతున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో జరుగుతున్న 8వ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్‌’లో కీలకమైన 6జీ ప్రణాళికలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. గ్లోబల్ టెక్నాలజీ పోటీలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని అనుసరించి.. అధికారికంగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి దేశంగా భారత్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌‌లో భాగంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) నిర్వహించిన ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ’ సెషన్‌లో జ్యోతిరాదిత్య సింధియా ఈ మేరకు మాట్లాడారు.

4జీ, 5జీ టెక్నాలజీల వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ఇక 6జీ వినియోగంలో కూడా ముందుంటామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 6జీకి ఆమోదం తెలిపిన తొలి దేశం మనదే కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. 6జీ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలో ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా నొక్కి చెప్పారు. 6జీ ప్రయోజనాలు సాధారణ వినియోగదారుడికి కూడా చేరాలని, అందుకు ధరలు అందుబాటులో ఉండాలని అవసరం ఉందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా 6జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి వస్తే.. 6జీ సాంకేతికతను వినియోగించనున్న తొలి వ్యక్తులుగా దేశంలోని రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వీ (వాడా-ఐడియా) యూజర్లు నిలవబోతున్నారు.

  • Loading...

More Telugu News