Baba Siddiqui Murder Case: సిద్దిఖీ షూటర్లను పట్టుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర

API Rajendra Dabhade Risks Life to Catch Baba Siddiqui Shooters Fleeing After Firing

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిఖీ హత్య
  • ఘటన జరిగినప్పుడు దేవీ విగ్రహ నిమజ్జనంలో బందోబస్తులో ఉన్న రాజేంద్ర
  • నిందితులను వెంటాడి పట్టుకున్న అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్
  • కేసు ఛేదనకు వివిధ రాష్ట్రాల్లో 15 బృందాల మోహరింపు

ఎన్‌సీపీ ముఖ్యనేత బాబా సిద్దిఖీ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, సిద్దిఖీ హత్య సమయంలో సమీపంలోనే దేవి విగ్రహ నిమజ్జనం విధుల్లో ఉన్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఏపీఐ) రాజేంద్ర దభాడే అత్యంత వేగంగా స్పందించారు. ప్రాణాలకు తెగించి నిందితులను వెంటాడి పట్టుకున్నారు.

నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర ఈ ఘటన జరిగినప్పుడు ఖేర్వాడి ప్రాంతంలో దేవి విగ్రహ నిమజ్జనం విధులు చూసుకుంటున్నారు. బాబా సిద్దిఖీని ముష్కరులు కాల్చి చంపడం చూసిన రాజేంద్ర వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉన్నాయని తెలిసినా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వెంబడించి వారిని పట్టుకున్నారు. మరో నిందితుడు మాత్రం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు, పటాకులు కాల్చడంతో పెద్ద ఎత్తున వచ్చిన పొగను ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు. 

సిద్దిఖీ హత్యపై పోలీసులు వేగంగా స్పందించారు. విచారణను వెంటనే క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. నటుడు సల్మాన్ ఖాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మధ్య ఉన్న వైరం సహా అన్ని కోణాల నుంచి ఈ కేసును విచారిస్తున్నారు. కేసును ఛేదించేందుకు వివిధ రాష్ట్రాల్లో మొత్తం 15 బృందాలను మోహరించినట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ దత్తా నలవాడే తెలిపారు.

  • Loading...

More Telugu News