Haryana: హర్యానాలో బీజేపీ గెలుపు... కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Asaduddin  calls for Opposition unity

  • హర్యానాలో బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించిన అసదుద్దీన్
  • అక్కడ మజ్లిస్ లేకుండా కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్య
  • విపక్షాలన్నింటినీ కలుపుకొని పోతేనే మోదీని ఓడించగలమన్న అసద్
  • మూసీ పేరుతో రేవంత్ రెడ్డి మా వెంటే పడుతున్నారని ఆగ్రహం

తాము బీజేపీకి 'బీ' టీమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తుంటుందని, మరి హర్యానాలో మజ్లిస్ పార్టీ లేకున్నప్పటికీ కమలం పార్టీ ఎలా గెలిచిందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. నిన్న రాత్రి వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... హర్యానాలో బీజేపీ ఎందుకు గెలిచింది? కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఏమీ చేయలేదన్నారు.

తాను చెప్పే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్రమోదీని ఓడించాలంటే విపక్షాలు అన్నీ ఏకం కావాలని సూచించారు. అందరినీ కలుపుకొని వెళితేనే మోదీని ఓడించగలుగుతారన్నారు. 

రేవంత్ రెడ్డి మా వెంటే పడుతున్నారు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ... మూసీ అంటూ మా వెంట ఎందుకు పడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మూసీ నది అనంతగిరి అడవుల్లో పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహించి నల్గొండకు వస్తుందని గుర్తు చేశారు. కానీ సీఎం మాత్రం మూసీ పరీవాహక ప్రాంతం అంటూ కేవలం తమ వెంటే పడుతున్నారని హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.

వాస్తవానికి ఆ పార్టీలు బీజేపీ 'బీ' టీమ్: కాంగ్రెస్ నేత

మజ్లిస్ పార్టీ సహా పలు పార్టీలు బీజేపీని విమర్శిస్తుంటాయని కానీ, వాస్తవానికి ఆ పార్టీలు బీజేపీకి 'బీ' టీమ్‌లు అని కాంగ్రెస్ పార్టీ నేత ఉదయ్ రాజ్ ఆరోపించారు. బీజేపీ 'బీ' టీమ్ ఎవరనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీ టీమ్ పార్టీలు అక్కడకు వెళ్లి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News