software employee: రూ.10 వేలు ఎర వేసి కోట్లు కొల్లగొట్టారు!

a software employee from hyderabad loss rs 2 crore in cyber attack

  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా చేర్చుకున్న సైబర్ నేరగాళ్లు   
  • కోటక్ సెక్యూరిటీ లిమిటెడ్ వీఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో లాభాలు వస్తాయని ఎర  
  • కోటక్ ప్రో యాప్ డౌన్ లోడ్ చేయించి దఫదఫాలుగా రూ.2.29 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తుల బలహీనతను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బాగా చదువుకున్న వాళ్లు సైతం పడి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి .. సైబర్ నేరగాడి ఉచ్చులో పడి రూ.2.29 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి (50) ఫోన్ నెంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు జులై 19న కేఎస్ఎల్ అఫిషియల్ స్టాక్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేశారు. నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీలో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నానని, షేర్లు క్రయ విక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని గ్రూపులోని సభ్యులు తరచూ ఛాటింగ్ చేసేవాడు. విఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో చేరితే లాభాలు వస్తాయని అక్టోబర్ 2 నుంచి కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్ పేరుతో ఒక వ్యక్తి పోస్టు చేసి ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ ప్లాన్‌లో చేరినందుకు తమకు లాభాలు వచ్చాయని గ్రూపు సభ్యుల పేరుతో సందేశాలు పోస్టు చేశాడు.

దీంతో ఇది నిజమేనని భావించిన ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తొలి సారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనిపై పది శాతం లాభం వచ్చినట్లుగా యాప్‌లో మరుసటి రోజు మోసగాళ్లు చూపించారు. తొలుత పదివేలు లాభంగా రావడంతో అతను దఫదఫాలుగా రూ.2.29 కోట్లు బదిలీ చేశాడు. ఈ పెట్టుబడికి రూ.1.10 కోట్లు లాభం వచ్చిందని ఖాతాలో చూపిన సైబర్ నేరగాళ్లు .. పది వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. మొత్తం రూ.3.29 కోట్లు విత్ డ్రా చేసుకోవాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలని పేర్కొనడంతో పాటు రకరకాల నిబంధనలు పెట్టారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యగికి అనుమానం వచ్చి తనకు తెలిసిన వ్యక్తులను దీనిపై ఆరా తీశాడు. ఇదంతా సైబర్ నేరగాళ్ల మోసమని తెలియడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News