Chandrababu: ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్ కు వెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు

CM Chandrababu reviews on mining dept

  • మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
  • ఇసుక విధానం తీరుతెన్నులపై అధికారులకు దిశానిర్దేశం
  • అక్టోబరు 16 నుంచి 108 కొత్త రీచ్ లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రాష్ట్ర సచివాలంలో మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని... ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ఈ సమీక్షలో అధికారులు వివరించారు. ఈ రీచ్‌ ల ద్వారా రోజూ 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 30,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని... కొత్తగా అందుబాటులోకి వచ్చే రీచ్ లతో అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. 

ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తద్వారా ఆన్‌లైన్ పోర్టల్ నుండి బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్‌కు వెళ్లవచ్చునని చంద్రబాబు తెలిపారు.

ఇసుక రీచ్‌లను డిస్ట్రిక్ట్ లెవల్ శాండ్ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏజెన్సీలను డిస్ట్రిక్ట్ లెవల్ శాండ్ కమిటీ టెండర్ల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తుందని అధికారులు తెలిపారు. ర్యాంప్ ల ఏర్పాటు, రీచ్ ల నిర్వహణ వ్యవహారాలు వీరు చూస్తారని అధికారులు వివరించారు. 

అయితే రీచ్ పాయింట్ వద్ద ఇసుక సరఫరా రేటు డీఎల్‌ఎస్‌సీ నిర్ణయించినట్లుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అవసరం ఉందని... దీనిపై నిరంతర నిఘాతో పాటు నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. చెకింగ్, జీపీఎస్ ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

రాబోయే రోజుల్లో ఇసుక రీచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రైవేట్ వ్యక్తులు కూడా మైనింగ్ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రైవేట్ వ్యక్తుల కోసం అనుమతించబడిన ఈ కొత్త ప్రైవేట్ ఇసుక రీచ్‌లలో కూడా డీఎల్‌ఎస్‌సీ నిర్ణయించిన ధరకే ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News