ADR Report: హర్యానా ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే: ఏడీఆర్‌ నివేదిక

ADR Report says 96 Percent of MLAs are Crorepatis who won in Haryana Elections

  • ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్‌ 
  • గత ఎన్నికలతో పోలిస్తే కోటీశ్వ‌రుల‌ సంఖ్య 3శాతం పెరిగిన‌ట్లు వెల్ల‌డి
  • 90 మందిలో 44శాతం మందికి రూ.10కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులు

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో మ‌రోసారి అధికారం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ 11 సీట్లకు ప‌రిమితం కాగా, ఐఎన్‌ఎల్‌డీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. 

అయితే, ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఉన్న‌ట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) నివేదిక వెల్ల‌డించింది. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్‌ పరిశీలించగా ఈ విష‌యం తెలిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య మూడుశాతం పెరిగిన‌ట్లు తేలింది.

ఇక 90 మందిలో 44 శాతం మందికి రూ.10కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులున్నాయ‌ట‌. కేవలం 2.2శాతం మందికి మాత్రమే రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయ‌ని తెలిసింది. అలాగే 13 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  95 శాతం కాంగ్రెస్‌, 96 శాతం బీజేపీ, ఐఎన్‌ఎల్‌డీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వందశాతం తమకు రూ.కోటి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

హిసార్ నియోజ‌కవ‌ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్‌ రూ.270కోట్ల ఆస్తులతో మొద‌టి స్థానంలో ఉంటే... రూ.145 కోట్లతో శక్తి రాణిశర్మ (బీజేపీ), రూ.134 కోట్ల ఆస్తులతో శృతి చౌదరి వ‌రుగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులు 59శాతం పెరిగిన‌ట్లు రిపోర్ట్ వెల్ల‌డించింది. గతంలో వారి ఆస్తులు రూ.9.08కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.14.46కోట్లకు పెరిగాయ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News