Ratan Tata: ర‌త‌న్ టాటా మృతి పట్ల ప్ర‌ధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

PM Modi and Telugu States CMs Paying Tribute to Ratan Tata

  • ర‌త‌న్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, అసాధార‌ణ‌మైన వ్య‌క్తి అన్న మోదీ
  • నిజమైన మానవతావాదిని కోల్పోయామ‌న్న‌ చంద్ర‌బాబు
  • టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణమ‌న్న రేవంత్‌

వ్యాపార దిగ్గ‌జం రతన్ టాటా మృతి పట్ల వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయ‌న మృతిప‌ట్ల‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న‌ను క‌లిసిన సంద‌ర్భాల‌ను ప్ర‌ధాని గుర్తు చేసుకున్నారు. 

ర‌త‌న్ టాటా అసాధార‌ణ‌మైన వ్య‌క్తి: ప్ర‌ధాని మోదీ
"రతన్ టాటాజీ దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయగల ఆత్మ, అసాధారణమైన వ్య‌క్తి. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఆయన వినయం, దయ, మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు. చాలా మందికి ఆయన ఆప్తుడయ్యారు" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

నిజమైన మానవతావాదిని కోల్పోయాం: చంద్ర‌బాబు
"రతన్ టాటా మాదిరి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయి ముద్ర వేసిన వారు చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైకూన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయాం. ఈరోజు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, పరిశ్రమ, దాతృత్వం విష‌యంలో తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే, దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సహకారాన్ని కూడా గుర్తుచేస్తున్నాను. ఆయ‌న ప్రియ‌మైన‌ వారికి, టాటా గ్రూప్‌కు ప్రగాఢ సానుభూతి" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

ఆయన స్ఫూర్తి మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది: తెలంగాణ సీఎంఓ
"భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది. టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం. ఆయన అసాధారణ నాయకత్వంలో టాటా బ్రాండ్ అసమానమైన ఎత్తులకు ఎదిగింది. ప్రతి భారతీయుడుని గర్వంతో నింపింది. భారతదేశాన్ని ప్రపంచ పారిశ్రామిక శక్తిగా మార్చడంలో ఆయన చేసిన సాటిలేని కృషి చెరగని ముద్ర వేసింది. 

రతన్ టాటా వ్యాపార శ్రేష్టత, అచంచలమైన నీతి, సామాజిక నిబద్ధత అనేవి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయ‌న‌ మరణంతో భారతదేశం ఒక గొప్ప‌ పారిశ్రామికవేత్త‌ను మాత్రమే కాకుండా నిజమైన సేవా స్ఫూర్తిని, సమగ్రతను మూర్తీభవించిన ప్రియమైన కుమారుడిని కోల్పోయింది. ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. టాటా కుటుంబానికి మరియు ఈ అపారమైన నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తున్న అసంఖ్యాక భారతీయులకు ముఖ్యమంత్రి తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నారు. రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన స్ఫూర్తి మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది" అని తెలంగాణ సీఎంఓ త‌న ట్వీట్‌లో పేర్కొంది. 

నమ్మలేకపోతున్నా..: ఆనంద్ మహీంద్రా 
పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. 'రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేను’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. "భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉంది. మనం ఈవేళ వున్న స్థితికి రతన్ జీవితం, ఆయన కృషి చాలా పెద్ద సహకారం అందించాయి. అందువల్ల, ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం మరింత అమూల్యమైంది. ఆయన నిష్క్రమణ తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే. మహోన్నతుడికి వీడ్కోలు. మిమ్మల్ని మరిచిపోలేము. ఎందుకంటే లెజెండ్స్ ఎప్పటికీ గతించరు... ఓం శాంతి" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

గడియారం టిక్ మనడం ఆగిపోయింది: హర్ష గోయెంకా
"గడియారం టిక్ మనడం ఆగిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపారంలోనూ, వెలుపలి ప్రపంచంలోనూ చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ చిర‌స్మ‌ర‌ణీయంగానే ఉంటారు" అంటూ హర్ష గోయెంకా సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News