Team India: బంగ్లాదేశ్ ను అలవోకగా ఓడించిన టీమిండియా కుర్రాళ్లు

Team India edgepast Bangladesh by 7 wickets in 1st T20

  • గ్వాలియర్ లో తొలి టీ20 మ్యాచ్
  • 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన టీమిండియా
  • 128 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించిన వైనం 

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా గెలుపు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. బంగ్లా జట్టుపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా కుర్రాళ్ల జట్టు సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

గ్వాలియర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

అంతకుముందు, ఓపెనర్ సంజు శాంసన్ 29 పరుగులు సాధించగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 29 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 16 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1, మెహిదీ హసన్ మిరాజ్ 1 వికెట్ తీశారు. 

ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 9న ఢిల్లీలో జరగనుంది.

  • Loading...

More Telugu News