YS Sharmila: అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ మారిపోయాడు: షర్మిల

YS Sharmila take swipe at Pawan Kalyan

  • తిరుపతి వారాహి సభలో రాహుల్ పై పవన్ వ్యాఖ్యలు
  • పవన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోందన్న షర్మిల
  • పవన్ ఓ మతానికి చెందిన వేషం వేసుకున్నారంటూ విమర్శలు

తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. 

మీకు అధికారం శాశ్వతం అనుకోవద్దు... తిరుపతి సభలో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మీరు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదగ్గవి కావు అని స్పష్టం చేశారు. మీ మత రాజకీయాల్లోకి రాహుల్ గాంధీని లాగడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది అని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

"అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి వేషం,  భాష రెండూ మారాయి. లౌకికవాద పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్ పార్టీగా మారిందా? బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ... ఒక మతానికి చెందిన వేషం వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే, ఇతర మతాలకు అభద్రతా భావం ఉండదా? ఎన్నికల్లో మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా? ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా?

మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే, అదే సిద్ధాంతానికి పవన్ కల్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారాడు. ప్రధాని మోదీ డైరెక్షన్ లో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదు. 

గోద్రా, మణిపూర్ లో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా? అలాంటి పార్టీకి మద్దతిస్తున్న మీరు లౌకికవాదం పాటించాలని చెబితే నమ్మమంటారా? దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం తగదు... మీ స్థాయిని దిగజార్చుకోవద్దు" అని షర్మిల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News