Hyderabad news: మూసీ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

hyderabad incentive of 25 thousand rupees for moosi residents

  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నా ఇళ్లు ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయని మూసీవాసులు 
  • ఇప్పటి వరకూ 40 శాతం మందే ఇళ్లు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లిన వైనం
  • ఈ రోజు, రేపు ప్రతి నిర్వాసిత కుటుంబాన్ని కలిసి ఇబ్బందులు తెలుసుకోనున్న రెవెన్యూ అధికారులు

మూసీ బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నా కొందరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మూసీ నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తున్నా వారిలో చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తం అందించనున్నారు. ఇల్లు ఖాళీ చేసిన వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు వారికి ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

అయితే ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తమకు సమీపంలోనే రెండు మూడు కిలో మీటర్ల దూరంలో కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్‌నగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లిగుడెసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. 

ఇప్పటి వరకూ 40 శాతం మంది మాత్రమే ఇళ్లు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్న 60 శాతం మంది కుటుంబాల ఇబ్బందులను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఈరోజు, రేపు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News