Sridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఆ పార్టీ నేతలే మరిచిపోతున్నారు: శ్రీధర్ బాబు

Sridhar Babu reveals Musi River Front constituted by brs

  • 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారన్న మంత్రి
  • మూసీ ప్రాజెక్టును ఎలా చేపట్టాలనే అంశంపై 2018లో సమావేశం నిర్వహించినట్లు వెల్లడి
  • ఆక్రమణలను తొలగించాలని నాడు కేటీఆర్ చెప్పారని వెల్లడి

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ హయాంలోనే అని, గతంలో వారు చేసిన పనులను ఆ పార్టీ నేతలే మరిచిపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి కార్పోరేషన్లకు చైర్మన్‌ను కూడా నియమించినట్లు వెల్లడించారు.

మూసీ ప్రాజెక్టును ఏవిధంగా చేపట్టాలనే అంశంపై 2018లో సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. మూసీ నదికి హద్దులతో పాటు 50 మీటర్ల బఫర్ జోన్‌ను కూడా నిర్ణయించాలని సూచించారని వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలను తొలగించాలని నాటి సమావేశంలో కేటీఆర్ చెప్పారన్నారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8,480 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని తెలిపారు.

మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని కేటీఆర్ 2021లో ఆదేశించారని, నిర్వాసితుల పరిహారంపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. ప్రజలకు శుభ్రమైన గాలి, నీరు అందించాలని నాటి ప్రభుత్వం ఆలోచించిందని భావించామని, ఇప్పుడు తాము కూడా అలాగే అనుకుంటున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని, దానిని బీఆర్ఎస్ నేతలు మరింత సంక్లిష్టంగా మార్చుతున్నారని ఆరోపించారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారో మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కనీసం వారు ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా బలవంతంగా వెళ్లగొట్టారన్నారు. కానీ తాము మూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఉపాధి చర్యలు కూడా చేపట్టామన్నారు. అందరితో చర్చించి ముందుకు వెళుతుంటే బురద జల్లడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News