Raghunandan Rao: కొండా సురేఖ ఇష్యూ... మీ ఫొటో ఉపయోగించిన వారిపై కేసు పెట్టండి: హరీశ్ రావుకు రఘునందన్ రావు సూచన

Raghunandan Rao suggestion to BRS leader Harish Rao

  • లేకుంటే తామే కేసు పెడతామన్న రఘునందన్ రావు
  • అలాంటి వ్యక్తితో సంబంధం లేదని హరీశ్ రావు ప్రకటించాలని డిమాండ్
  • అమ్మకు ఆలికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • బీఆర్ఎస్ వారికి అక్క అంటే కవిత మాత్రమేనా? అని ఎద్దేవా

మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్ట్ పెట్టిన వ్యక్తి హరీశ్ రావు ఫొటోను ఉపయోగించుకున్నాడని, కాబట్టి ఆయనకు ఓ సూచన చేస్తున్నానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన ఫొటోను ఉపయోగించుకుంటున్న వారి మీద హరీశ్ రావు కేసు పెట్టాలని సూచించారు. లేదంటే వారిపై తామే కేసు పెడతామని అల్టిమేటం జారీ చేశారు. తాము కేసు పెట్టినప్పుడు హరీశ్ రావు విచారణకు సహకరించాలని, పట్టుకొచ్చిన వారి కోసం ఫోన్ కాల్ చేయవద్దన్నారు. అంతేకాదు, అలాంటి వ్యక్తితో తనకు సంబంధం లేదని హరీశ్ రావు పత్రికాముఖంగా ప్రకటన చేయాలన్నారు.

బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కొండా సురేఖ చేనేత సమస్యలు వినేందుకు దుబ్బాక వచ్చారని, అలాంటి సమయంలో ఆమెపై ట్రోల్ చేయడం పట్ల తాను బాధపడుతున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చేతనైతే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని సూచించారు. తప్పు చేస్తే విమర్శించాలని, రాజకీయంగా ఎదుర్కోవాలని, ఇంకా చేతనైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి, అంతే తప్ప వ్యక్తిత్వహననానికి పాల్పడవద్దన్నారు.

అమ్మకు ఆలికి తేడా తెలియకుండా... అక్క అంటే కవితేనా?

ప్రశ్నిస్తే, మా కవితక్క జైలుకు పోయినప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టలేదా, మా కవితక్కను తిట్టలేదా? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని, అలాంటి సమర్థన కామెంట్లు ఏమాత్రం సరికాదన్నారు. అమ్మకు, ఆలికి తేడా తెలియనంత సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ వారికి మహిళలు అంటే కవితక్క తప్ప మరొకరు కాదనుకుంటానని విమర్శించారు.

ఓ అక్కగా చేనేత కార్మికుల సమస్యలకు పరిష్కారం ఇస్తారనే ఉద్దేశంతో నోరారా అక్కా అని పిలిచి నేతన్నల సమస్యలను విన్నవించామన్నారు. కానీ మహిళా మంత్రి, బీసీ మంత్రి అని చూడకుండా ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల ఇప్పటికే మీకు శిక్షపడిందని భావిస్తున్నానని, ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా? అని నిలదీశారు. 

బీఆర్ఎస్‌కు మహిళలపై సంస్కారం లేదని, అది బీఆర్ఎస్ తొలి కేబినెట్లోనే వెల్లడైందన్నారు. ఇప్పటికైనా వారు మారాలని హితవు పలికారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అయినా వారికి భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని, తోటి మహిళలో తల్లిని, చెల్లిని చూసే గుణం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

  • Loading...

More Telugu News