TTD: లడ్డూపై రాజకీయాలు తగవు ..ఇక ఆపేయండి: సీపీఐ రామకృష్ణ

CPI Rama Krishana Comments on Tirumala laddu Issue

  • లడ్డూ వివాదంపై ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టాలని సూచించిన సీపీఐ రామకృష్ణ
  • రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ పెట్టాలన్న రామకృష్ణ
  • దేవుడిని అడ్డంపెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం తగదని రామకృష్ణ హితవు

ఏపీలో తిరుమల లడ్డూ వివాదంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక సూచన చేశారు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టాలని సూచించారు. తప్పు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విమర్శలు మానుకొని రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. 

తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ వివాదంపై అవసరమైతే సీఎం, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని, ఈ వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికా అని ప్రశ్నించారు. భార్య క్రిస్టియన్ అని చెప్పిన పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లొచ్చా అని నిలదీశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 

అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదని రామకృష్ణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ అయిదేళ్లు, వైఎస్ జగన్ అయిదేళ్లు సీఎంగా ఉండి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు మాట్లాడకుండా .. నేడు జగన్ సాధారణ భక్తుడిగా తిరుమలకు వెళ్తామంటే డిక్లరేషన్ అడగడం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News