IPL: ఆర్‌టీఎం కార్డ్ అంటే ఏమిటి?.. ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ వేలంలో తిరిగొచ్చిన కొత్త రూల్..

what is this RTM and how is it exercised in IPL Auction

  • జట్టులో అట్టిపెట్టుకోని ఆటగాడిని వేలంలో దక్కించుకునే అవకాశాన్ని కల్పించనున్న ఆర్టీఎం నిబంధన
  • వేలంలో ఆటగాడు పలికిన గరిష్ఠ ధరకు ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం
  • ఆరేళ్ల తర్వాత 2025 మెగా వేలంలో అమలు కానున్న నిబంధన

ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చనే దానిపై  ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం స్పష్టత ఇచ్చింది. రిటెన్షన్ నిబంధనలను ప్రకటించింది. ఏ ఫ్రాంచైజీ అయినా జట్టులో ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చని తెలిపింది. రిటెయిన్ చేసుకోవడం లేదా ఆర్‌టీఎం కార్డు ద్వారా.. ఈ రెండు విధానాల్లో ఏ రూపంలోనైనా గరిష్ఠంగా ఆరుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆర్‌టీఎం కార్డ్ అంటే ఏమిటి? ఈ నిబంధనను ఎలా అమలు చేస్తారు? అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

ఆర్టీఎం అంటే ‘రైట్ టు మ్యాచ్’. రిటెయిన్ చేసుకోని ఒక ఆటగాడిని ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తిరిగి దక్కించుకునే హక్కుని ఈ నిబంధన కల్పిస్తోంది. తమ జట్టులో ఆడిన ఆటగాడు వేలంలో అందుబాటులో ఉంటే అతడిని తిరిగి పొందడానికి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటగాడు వేలంలో రూ. 16 కోట్ల ధర పలికాడని అనుకుందాం. వేలంలో ఏ జట్టు అతడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆర్టీఎం కార్డుని ఉపయోగించి పాత ఫ్రాంచైజీయే అతడిని దక్కించుకోవచ్చు. అంటే బిడ్డింగ్‌లో గరిష్ఠంగా ఎంత ధర పలికితే అంత ధరకు తిరిగి జట్టులోకి తీసుకోవడం అన్నమాట. ఈ ప్రక్రియలో ఆటగాళ్ల ధర పెరగవచ్చు లేదా తగ్గవొచ్చు. అవకాశాన్ని బట్టి పాత ఫ్రాంచైజీలే తిరిగి దక్కించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆరేళ్ల తర్వాత ఈ రూల్ తిరిగి ప్రవేశపెట్టారు. ఐపీఎల్ 2018 మెగా వేలంలో ఆర్టీఎం కార్డు నిబంధన ఉంది. అయితే ఐపీఎల్ 2022లో దీనిని తొలగించారు.

మరోవైపు.. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకొని ఎంపికైన తర్వాత టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే విదేశీ ఆటగాళ్లపై గట్టి చర్యలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. తదుపరి ఏడాది వేలంలో పేరు నమోదు చేసుకోవడానికి అనర్హులు అవుతారని తెలిపింది. ఇక సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉండలేనంటూ ప్రకటించే ఆటగాళ్లు 2 సీజన్ల వేలంలో పాల్గొనకుండా నిషేధించనున్నట్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News