HRC: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హెచ్ఆర్సీలో కేసు నమోదు

Case against Ranganath in HRC

  • కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య
  • హైడ్రా కూల్చివేతల భయంతో ఆత్మహత్య చేసుకుందంటున్న కుటుంబ సభ్యులు
  • హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హెచ్ఆర్సీలో కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు హైడ్రా తమ ఇళ్లను కూలుస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్‌పై హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది.

హైడ్రా కూల్చివేతల వల్లే తమ తల్లి బలవన్మరణానికి పాల్పడిందని బుచ్చమ్మ కుమార్తెలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 16063/IN/2024 కింద కేసు నమోదు చేసినట్లు, విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది.

కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా కూల్చివేతల భయంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాదవబస్తీలో నివాసముండే శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బుచ్చమ్మ దంపతులది పాలవ్యాపారం. వీరు వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత ఒక్కోక్కరికి ఒక్కో ప్లాట్‌ ఇచ్చారు. నల్ల చెరువు పరిసరాల్లోని వెంకట్రావునగర్‌, శేషాద్రినగర్‌లోని ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి అద్దెకు ఇచ్చారు.

అయితే, నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా అధికారులు ఇటీవల తొలగించారు. చెరువు పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో తమ ఇళ్లు ఎక్కడ కోల్పోతామోననే భయంతో బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆ ఇళ్లను కూల్చివేస్తే తమ కూతుళ్లు ఇబ్బందులు పడతారని ఆమె మనోవేదనకు గురైంది.

  • Loading...

More Telugu News