Nara Lokesh: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ వివాదంపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh responds on Tirumala Laddu and Vishaka steel plant

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జరగనివ్వమన్న లోకేశ్
  • అసలు చర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు
  • తిరుమల లడ్డూపై సిట్ దర్యాఫ్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్న మంత్రి
  • గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకువెళ్తామన్న మంత్రి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నోవాటెల్‌లో సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జరగనివ్వమని, ఇది అసలు చర్చనే కాదని, కానీ దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైన విషయంలో సిట్ దర్యాఫ్తులో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియర్లు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో విశాఖకు ఏం చేయాలి? మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశాలపై చర్చించామన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై చర్చించడం జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయని, వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్‌లా అవి ఆగిపోయాయని ఆరోపించారు. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం

గత ప్రభుత్వం రోడ్లు నిర్మించలేదని... కనీస గుంతలు కూడా పూడ్చలేదన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కి వెళ్లిపోయారన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలని, మౌలిక సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. వెనుకబడిన ఏపీని మళ్లీ ముందుకు తీసుకుళ్లేందుకు సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నామన్నారు. వారి సలహాలతో వాటిని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్నారు. ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అందుకు తగ్గట్లుగా రాయితీలు కల్పిస్తామని, ఇందులో భాగంగా పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నామన్నారు.

విశాఖను ఐటీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం

గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, కానీ గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికే అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీతో చర్చించామన్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. వాటిని పరిష్కరించినట్లు కూడా చెప్పారు. ఓ పెద్ద ఐటీ కంపెనీ 1,500 మందికి ఉద్యోగాలు కల్పించనుందన్నారు. కానీ ఆ కంపెనీకి గతంలో వీధిదీపాలు కూడా వేయలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారికి కావాల్సిన బస్ సౌకర్యం కూడా అందించలేదన్నారు. టీడీపీ వచ్చాక అవన్నీ క్లియర్ చేశామని, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారని తెలిపారు. ఫీల్డ్ విజిట్స్‌కి కూడా వెళుతున్నట్లు చెప్పారు.

రాబోయే వంద రోజుల్లో ఐటీ పాలసీ తీసుకువస్తాం

రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ పాలసీ తీసుకువస్తామని లోకేశ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, గతంలో ఓ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. భూమి కూడా ఇచ్చి శంకుస్థాపన కూడా చేశామన్నారు.

గత ఐదేళ్లలో విధ్వంసం చేశారు

పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న రాయితీలను అందిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమన్నారు. గత ఐదేళ్ల కాలంలో విధ్వంసం చేశారని ఆరోపించారు. ఈడీబీ (ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు)ని కూడా రద్దు చేశారని మండిపడ్డారు. దీనిని పునరుద్ధరించినట్టు చెప్పారు. గతంలో ఐటీ మంత్రి ఎప్పుడూ ఐటీ పరిశ్రమలతో సమావేశం నిర్వహించలేదని, తాము ఫోకస్డ్‌గా వెళుతున్నామన్నారు. టాటా ఛైర్మన్ స్వయంగా వచ్చారని, ఇప్పుడు వైజాగ్ గురించి, ఏపీ గురించి మాట్లాడుకునే పరిస్థితికి తీసుకు వచ్చామన్నారు. గతంలో లూలూ సంస్థకు చంద్రబాబు రెడ్ కార్పెట్ వేసి తీసుకు వచ్చారన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామని లూలూ చెప్పిందన్నారు. పొరపాటున మళ్లీ సైకో వస్తే పరిస్థితి ఏమిటని పారిశ్రామికవేత్తలు భయపడిపోయారన్నారు.

విశాఖ ఉక్కుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది

ఏ విషయంలో అయినా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాము పరదాలు కట్టుకొని తిరగడం లేదని, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడామని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. వారికి కావాల్సిన రాయితీలు కూడా ఇవ్వలేదన్నారు. మైనింగ్‌ను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి

బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారని ద్వజమెత్తారు. తిరుమల లడ్డూపై ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే.. వైవీ సుబ్బారెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకు ఇచ్చారని, సిట్ దర్యాఫ్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వైసీపీ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కాదని... ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని గుర్తించాలన్నారు.

  • Loading...

More Telugu News