Chandrababu: దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ అభివృద్ధికి రూట్ మ్యాప్: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh vows for Andhra Pradesh

  • చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు
  • దేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామన్న లోకేశ్
  • 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపు
  • విశాఖలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్

2047 నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన సదస్సుకు జాతీయస్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాష్టంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వ చర్యల కారణంగా అయిదేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయని, అన్నివిధాలా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగవంతంగా ముందుకు సాగుతోందన్నారు.
 
అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి

చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రంగంపై దృష్టి సారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కర్నూలు జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని, రాబోయే ఐదేళ్లలో 72 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా హైడ్రో, విండ్, సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అక్కడకు వస్తాయని ఆకాంక్షించారు.

అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్ రీజియన్, గోదావరి జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు గత అయిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. గోదావరి జిల్లాల్లో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కారిడార్ అక్కడ రాబోతుందన్నారు.

విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్

విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే నెం. 1 ఐటీ హబ్‌గా తయారు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఉత్తరాంధ్రను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభయ్యాక విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

అయితే కేవలం పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినట్లు కాదని, ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ద్వారా వచ్చిన సంపద సమాజంలో అన్నివర్గాలకు పంపిణీ చేయడమే అసలైన అభివృద్ధి అన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్ పోర్టుగా నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందిందని, దీనిద్వారా సృష్టించిన సంపదతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ద్వారా విశాఖపట్నంలో దేశంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మహా విశాఖ

విశాఖపట్నంను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో విశాఖలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రాబోతుందన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది గతం మాట... ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలు ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో యువ ఐఏఎస్ అధికారి సారథ్యంలో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ)ను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఇస్తామన్నారు.

ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈడీబీ క్రియాశీలకంగా పని చేయబోతుందని, ప్రస్తుతం దేశంలో తొమ్మిదో అతిపెద్ద ఎకనమిక్ సిటీగా ఉన్న విశాఖను రాబోయే అయిదేళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు జీఎంఆర్ చేస్తున్న కృషిని లోకేశ్ అభినందించారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

రూ.17 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి: మంత్రి జనార్దన్ రెడ్డి

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వాన వేగవంతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టులు శరవేగంగా నిర్మితమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌లో ఉందన్నారు. మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా ఎయిర్ కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌కు దీటుగా విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామన్నారు.

పీపీపీ మోడ్‌లో క్రిటికల్ ఇన్‌ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులు చేపడతామన్నారు. చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో ఇన్‌ఫ్రా అభివృద్ధిలో భాగంగా విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రాబోతున్నాయన్నారు.

18 నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి: ఎంపీ భరత్

రాబోయే 18 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో విశాఖపట్నం దేశంలో 10వ నగరంగా ఉండగా, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో మాత్రం 27వ స్థానంలో ఉందన్నారు. ఈ గ్యాప్‌ను సరిదిద్దాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో ప్రారంభమైందన్నారు. వ్యక్తిగత విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకునేలా త్వరలో రాష్ట్రంలో పీఎం సూర్య పథకం ప్రారంభం కాబోతుందన్నారు. దీని ద్వారా విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు చౌకగా విద్యుత్ లభిస్తుందన్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే ప్రారంభమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై మంత్రి లోకేశ్ దృష్టిసారించి, వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలని కోరారు.

షీలానగర్-సబ్బవరం రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయని, అనకాపల్లి-భీమిలి రోడ్డు విశాఖపట్నం నగరం గుండా వెళ్ల ట్రాపిక్ సమస్య ఏర్పడుతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 12 ఫ్లైఓవర్లను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎలివేటెడ్ హైవే రోడ్డు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అధునాతన టెక్నాలజీతో హౌసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గంలో యువ నాయకత్వంతో విశాఖ నగరం వేగవంతంగా అభివృద్ధి సాధించబోతోందని, ఇందుకు పారిశ్రామికవేత్తలు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలన్నారు.

  • Loading...

More Telugu News