Karthi: పవన్ కల్యాణ్ సార్... క్షమించండి: హీరో కార్తీ

Actor Karthi apologizes Pawan Kalyan

  • వివాదాస్పదమైన కార్తీ లడ్డూ కామెంట్స్
  • లడ్డూపై జోక్స్ వద్దన్న పవన్ కల్యాణ్
  • తాను శ్రీవారి భక్తుడినని చెప్పిన కార్తీ

ఓ వైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందనే వార్త దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో లడ్డూపై సినీ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని... లేకపోతే నోరు మూసుకుని ఉండాలని పవన్ అన్నారు.  

ఈ క్రమంలో పవన్ కు కార్తీ క్షమాపణలు చెప్పారు. "పవన్ సార్... అనుకోకుండా ఏదైనా అపార్థం చోటు చేసుకుని ఉంటే క్షమించాలని కోరుతున్నాను. మీపై నాకు ఎంతో గౌరవం ఉంది" అని కార్తీ పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా తాను ఎప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

కార్తీ తాజా చిత్రం 'సత్యం సుందరం' సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో లేడీ యాంకర్ మాట్లాడుతూ... లడ్డూ కావాలా నాయనా అని కార్తీని అడిగింది. 

దీనికి సమాధానంగా... ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు... ఇది చాలా సున్నితమైన అంశమని కార్తీ నవ్వుతూ చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పవన్ సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు.

  • Loading...

More Telugu News